విభాగము--IV             శ్రీ శరభేశ్వరస్వామి(శరభాంకలింగస్వామి)వారి జీవితచరిత్ర
- పావులూరి శ్రీనివాసాచారి
|
శ్రీ శరభేశ్వరస్వామివారు నందికొండ యందలి పాపాఘ్నిమఠమున కధిపతి యగు విశ్వబ్రాహ్మణ వంశీయుడును,సనాతన గోత్రజ్ఞుడును అగు యనమదల వీరభోజయాచార్య స్వాముల వారికి వారి ధర్మపత్ని అక్కనాగమంబకు ప్రధమ పుత్రుడుగా పుట్టి శ్రీ వీర శరభాంక లింగస్వాములవారిగా ప్రసిద్ది చెందినట్లు శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానమును బట్టి తెలియుచున్నది.శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానమును బట్టి చూచిన శ్రీ శరభాంకులవారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి క్రొద్దికాలము ముందటి వాడై యున్నట్లును, ద్వాదశాబ్దముల వయస్సుననే తత్వావ లోకనాసక్తిచే నిర్జన ప్రదేశమున తపస్సు చేయు చుండ వారి తపోవేడిమికి యా ప్రాంతమున కొంత సంక్షోభము కలిగెను. అప్పుడు ఆ ప్రాంత పాలకుడగు చోళరాజు తో కుతంత్రులు కొందరు చేరి శరభాంకుల వారి తపస్సే యీ సంక్షోభమునకు కారణమనియు వారి తపస్సు భంగపరచుటయే ఇప్పటి ముఖ్యకర్తవ్యమనియు చెప్పి రాజు యొక్క అంగీకారమును పొంది అక్కార్య మునకు యత్నించినట్లు తెలియుచున్నది.శ్రీ స్వాములవారి తపోభంగము చేయ నొప్పుకొనిన నొక వేశ్య చాలా కాలము వరకు తన సహజ సౌందర్య రూపు రేఖల చేతను, వీణాగానాది కళల చేతను ఆకర్షింప జేయజాలక పోయెను. అటు తరువాత కాషాయ వస్త్రములు ధరించి తత్వ దర్శనాభిలాషివలె ప్రవర్తించుతూ ఆశ్రమమందు పరిశుధ్ధాది కార్యముల జేయుచూ స్వాముల వారు ఆశ్రమము వెలుపలకు పోయి తిరిగి వచ్చుచున్నపు డెల్ల భక్తి పారవశ్యమును వినయ విధేయతలను గన పరచుచు చాలా కాలము ఆశ్రమ సమీపమున నుండెను. మరి కొంత కాలమునకు ఆశ్రమ పరిశుభ్రతాది కార్యముల నిర్వర్తించుచూ శ్రీ స్వాములవారితో నొకనాడు తనకు తత్వ సందర్శ నాభిలాష మిక్కుటముగ గలదనియు అద్దానిని స్వాముల వారి పాదసేవచే పొందనభిలషించి యున్నాననియు యాకపట సన్యాసిని అతి వినయ మృదు మధుర వాక్కులతొ విన్నవించుకొనెను. ఆ పై శ్రీ స్వాములవారు యా కపట సన్యాసిని యొక్క కోరిక నిజమేనని కరుణ జూపినట్టగ పడి నప్పటినుండి స్వాములవారి అహింసా తత్వమునకు అనువుగా ప్రవర్తించుచు తానును నిష్కామివలె కార్యములొనరించుచూ యుండెను. అపుడపుడు స్వామివారితో ఫలాపేక్షను వదలి నిష్కామముతో కర్మ నాచరించుటయే ముఖ్య ధర్మమని గీతాది తత్వ గ్రంధముల యందలి కొన్ని ప్రమాణములను ఏకరువు పెట్టుచుండెను. శ్రీ స్వాములవారు యా కపట సన్యాసిని చెప్పుమాటలు నిజమనియు యావిడ కూడ నిష్కామియనియే విశ్వసించెను. విశ్వసించి నప్పటినుండి చాలా చనువుగా మాట్లాడుచుండెను.
ఒకనాడర్ధ రాత్రివేళ గాడాంధకారమున పెనుగాలితో ఉరుములు, మెఱుపులతో వర్షము కురియుచుండ వర్షమునకు తడచి గడగడ వణుకుచున్న యా కపట సన్యాసినిని కనికరించి అశ్రమములోనికి రమ్మనెను. అదను కొరకు వేచియున్న యా సన్యాసిని వెంటనే లోన ప్రవేశించి స్వామివారిని పరిపరి విధముల స్తుతించుచూ నిష్కామ కర్మల గురించి పలు విధముల ప్రశ్నించుచు ఫలాపేక్ష లేక నిష్కామముతో నాచరించు కర్మకు బాధ్యులెవరనియు, ఫలాపేక్షలేని నిష్కామ కర్మలకు తత్వజ్ఞులెంత మాత్రము బాధ్యులు కారనియు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడ ఫలాపేక్షను వదలి నిష్కామముతోనే గోపాంగనల కూడి తన పురుష ధర్మమును నిర్వర్తించెనని గీతాది తత్వా గ్రంధముల లోని ప్రమాణముల కొన్నింటిని చిలుక పలుకులవలె పఠించి స్వాములవారి మనస్సును చలింపచేసి తన ప్రయత్నము నెరవేర్చుకొనెను. ఇనుప కచ్చడాల్ కట్టి యెండుటాకులు తిన్న విశ్వామిత్రాది మహర్షులు కూడ స్త్రీల మాయలకు జిక్కినారన్నప్పుడు పంచవింశతి వత్సరముల ప్రాయముగల మన శరభాంకుల వారు చలించినారన్న చిత్రమేమున్నది? శ్రీ స్వాములవారి సంగమమున యా స్త్రీ గర్భముదాల్చి దిన దిన ప్రవర్ధమానయై పరిపక్వ దినమున బ్రహ్మతేజో విరాజితమైన నొక మగ శిశువును ప్రసవించెను. వెంటనే ఈ సమాచారమును తన్ను నియమించిన వారికెరుక పరచెను. వారి యాదేశమున, వెంటనే ఈ పసి పాపను నీవే పోషించుకొమ్మని అచట వదలి యా కపట సన్యానిని గ్రామమునకు దారి పట్టెను. శ్రీ స్వాములవారు ఈ కసిగందను నేనెట్లు పోషింతును? క్షీరాదులనొసంగి పోషించవలసినది నీవేకదా! గనుక ఈ పిల్లవానిని నీవే తీసుకొని పొమ్మని యాకసిగందును చేతులనుంచుకొని వెంబడించెను. కాని యా వేశ్య తన్ను నియమించిన వారికీ విషయము ప్రత్యక్షము చేయగోరి గ్రామ సమీపమున రచ్చబండపై నుండుడని తెలియపరచి అంగీకరించినట్లును, లేనట్లును దవ్వు దవ్వుల నేగుచుండెను. కావు కావు మని ఆకటి బాధతో నేడ్చుచున్న యా కసిగందను తన చేతులలో నుంచుకొనియే యాపె కందించ వలయునను తలంపున వెంట నడచుచూ యా రచ్చబండ వద్దకు పోవునప్పటికి యా స్త్రీని ఎదిగి రెండడుగులు ముందుకు నడచి అడ్డగించి ఇదిగో ఈ చిఱుతను తీసికొమ్మని అదలించి పలికెను. అప్పుడా రచ్చబండపై చేరి పరిహాస మొనర్ప ప్రయత్నపడుచున్న యా కుటిలాత్ములతో నావేశ్య దీనవదనయై అయ్యలారా! తనకు బుట్టిన బిడ్డను తాను పోషించుకొనుటయే ధర్మము కదా! మీరైనా చెప్పండని మధ్యవర్తిత్వము కోరినదానివలె వారితో చెప్పగా గేళిసేయ నువ్విళ్ళురూచున్న యా పెద్దలు శరభాంకుల వారితో ఇదేమి స్వామీ! తమ కుటుంబమా ఇది? తాము తత్వవేత్తలు కదా! ఈ స్త్రీ ఎవరు? శిశువెవరు? అని పలువురు పలు విధములుగా పరిహాసపు మాటలు పలుక శ్రీ స్వాములవారు వీరి అభిప్రాయమును గుర్తించి శాంత చిత్తమున వారినుద్దేశించి నాయనలారా! " గారుడ మన్త్రసిద్దు డురగంబులచే గరపించుకొన్న దద్ఘోర విషంబులెక్కవట కుంభినిలో శివ మంత్రసిద్దుడై, జారవినోదియై విషయ సంగతి జెందిన జెందుగాక యా పూరిత మోహపాశముల బొందడయా శరభాంకలింగమా" యని చెప్పి యాశిశువును సూర్యున కెదురుగా నెగురవేసి అంజలి ఘటించి "ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి" అను వేద మంత్రమును పఠించెనట. వెంటనే యాశిశువు శుక్లశోణిత రూపముగా వేరుపడి శ్రీ స్వాములవారి అంజలియందు శుక్లము పడి శోణితము వేరుగా పడెనట. వెంటనే తన అంజలిలో పడిన శుక్లమును స్వామివారు స్వీకరించిరట.
ఈ వింతను జూచినవారు మిగుల భయాశ్చర్యముల బొందిరి. వెంటనే యా కపట సన్యాసిని శ్రీ స్వాములవారి పాదములపైబడి క్షమించమని ప్రార్ధించెనట. అందులకా స్వామి ఇందు నీ తప్పేమున్నది, నిన్ను ఈ పనికి పురికొల్పినవారిది కదా తప్పని అనగనే అటనున్న అసూయాగ్రేసరులు మిగుల భయమొంది పలువురు పలు విధములుగా తమ తప్పును మన్నించుడని ఏక కంఠముగా మొఱబెట్టుకొనిరి. అందులకు శ్రీ స్వామివారు మీరు శ్రధ్ధతో వినుడని నీతిదాయకములగు 102 పద్యములు చెప్పి మీరొనర్చిన ఈ పాప ఫలితము 19-20 శతాబ్దముల మధ్య మీ జాతివారెల్ల జాతి భ్రష్టత్వము పొంది ఇతర జాతుల వారిచే పరిహాస భాజనులగుట ద్వారా తీరిపోవునని చెప్పిరట. అప్పటినుండి యా దేశవాసులందరు శ్రీ స్వామివారి యెడ మిక్కిలి భక్తి కలిగి ప్రవర్తించుచుండిరట.
ఈ కధకు ఆధారము ఇప్పటికి కాలజ్ఞానమొక్కటియే.
శ్రీ స్వామివారు చెప్పిన పద్యములు "శరభాంకలింగ శతకముగ" ప్రసిధ్ధిగాంచినవి. శ్రీ శరభాంకలింగ శతకము
నివేదన
సశేషం
|
---|